– జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
నవతెలంగాణ-పినపాక
మిరప సాగులో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పినపాక మండలం దుగినేపల్లి శివారు రెడ్డిగూడెం గ్రామంలో ఆదర్శ రైతు కామిశెట్టి మురళి వ్యవసాయ మిర్చి క్షేత్రంలో వివాంట సీడ్స్ జెస్సీ మిరప రకము పంట మిర్చి పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వాణిజ్యసరలిలో సాగవుతున్న మిర్చికి మంచి భవిష్యత్తు ఉందని ప్రస్తుత కాలం ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వివాంట సీడ్స్ జెస్సీ మిరప రకం చీడ పీడలను తట్టుకొని అధిక పూత, కాతతో అత్యధిక దిగుబడులు రావడం సంతోషకరమైన విషయం అన్నారు. చీడ పీడలను తెగుళ్లను తట్టుకొనే అధిక దిగుబడిని ఇచ్చే మిరప వంగడాల రూపకల్పనపై ప్రభుత్వ, ప్రయివేటు సెక్టార్లలో పరిశోధనలు మరింత వేగవంతంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆదర్శ రైతు కామిశెట్టి మురళిని శాలువాతో ఘనంగా సన్మానించి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివాంటా కంపెనీ రీజనల్ మేనేజర్ కిషోర్ కుమార్ హాజరై మాట్లాడుతూ దుగినేపల్లి పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన కామిశెట్టి మురళి అనే రైతు మిర్చి పంట అధిక దిగుబడిని ఇచ్చే విధంగా ఉందని వాతావరణ ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థవంతంగా తట్టుకోవటం హర్షనీయమన్నారు. రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వివాంటా సీడ్స్ జెస్సీ మిరప రకం క్షేత్ర సందర్శనకు మంగపేట, పినపాక మండలాలకు చెందిన వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు మిర్చి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దేవేందర్, లోకేష్, డిస్ట్రిబ్యూటర్ అవని ఏజెన్సీస్ నవీన్, రాజుపేట శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ బత్తుల నందకుమార్, బత్తుల ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.