– దళితబంధుకు ఎంపిక చేయడం లేదని వ్యక్తి ఆత్మహత్య
– దళితబంధు రాకుండా కౌన్సిలర్ అడ్డుకుంటున్నాడని సూసైడ్ లెటర్
నవ తెలంగాణ-మోత్కూరు
దళితబంధుకు ఓ నిండు ప్రాణం బలైంది. దళితబంధుకు తనను ఎంపిక చేయడం లేదన్న మనస్థాపంతో ఓ నిరుపేద దళితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు దళితబంధు రానందుకు కౌన్సిలర్ కారణమని, దళితబంధు రాని కారణంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతుడు సూసైడ్ లెటర్ రాశాడు. వివరాల్లోకి వెళితే…యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన కూరెళ్ల రమేష్ (50) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్త అయిన రమేష్ 12వ వార్డు కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో కూడా
పాల్గొంటున్నాడని కాలనీవాసులు తెలిపారు. దళితబంధు పథకంలో మొదటి విడతలో రమేష్ పేరు పెట్టకపోవడంతో రెండో విడతలో పెట్టిస్తామని అతనికి సర్దిచెప్పినట్టు చెబుతున్నారు. రెండో విడత దళితబంధు కోసం కౌన్సిలర్ కుమారస్వామి కాలనీకి చెందిన కొందరి పేర్లు ఎంపిక చేసి రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేకు పంపాడని, ఆ లిస్టులో తన పేరు పెడతామని కౌన్సిలర్ కుమారస్వామి పెట్టలేదని రమేష్ మనస్తాపం చెందాడు. మంగళవారం గాంధీనగర్ కాలనీలో అతని బంధువు చనిపోగా అంత్యక్రియల్లో పాల్గొని సాయంత్రం ఇంటికి రాగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రమేష్ దళితబంధులో తనను ఎంపిక చేయలేదని, తనను ఎంపిక చేయకుండా కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామి అడ్డుకుంటున్నాడని, దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టాడు. చిన్న కుమారుడు సామేల్ ఇంటికి రాగా అప్పటికే రమేష్ మృతి చెందాడు. దళితబంధుకు తన పేరు పెట్టకుండా కౌన్సిలర్ అడ్డుకున్నాడని, తనకంటే మెరుగ్గా ఉన్నవారిని లిస్టులో ఎంపిక చేసి తన పేరు లేదని తెలుసుకుని మనస్థాపంతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాప్రతినిధులు కాలనీలో రెండు వర్గాలుగా విడిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సందర్శించి పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు.
కౌన్సిలర్ వివరణ: మృతుడు రమేష్ రాసిన సూసైడ్ లెటర్ పై కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామిని వివరణ కోరగా దళితబంధు రాకపోవడానికి తాను కారణమన్నది అవాస్తవం. దళితబంధు పేర్ల ఎంపికతో తనకు ఎలాంటి సంబంధం లేదు.