– మనుషులమై బ్రతకాలి పుస్తకావిష్కరణ
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రజలకు ఉపయోగపడేది, జీవితం నుంచి గ్రహించిన విషయాలతో పాటు ప్రశ్నలని సంధించే కవిత్వం దివాకరాచారిదని అని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభలో కె.దివాకరాచారి కవితా సంపుటి ‘మనుషులమై బ్రతుకాలి’ ని శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనుషులమై మన బ్రతకాలి అని కవులు స్పష్టం చేస్తున్నారు. దివాకరాచారి ఆ బాధ్యత భుజాన వేసుకుని నడుస్తున్నారని అభినందించారు. అధ్యక్షత వహించిన ఆనందాచారి మాట్లాడుతూ మానవ సంబంధాలు ఎంత రంధి పడుతున్నాయో తెలియజేసే పుస్తకమే మనుషులమే బ్రతకాలి అని అన్నారు. ప్రముఖ రచయిత, పాలపిట్ట సంపాదకులు గుడిపాటి మాట్లాడుతూ వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసిన ఈ కవిలో నిత్య చైతన్యశీలి అయిన సామాజిక విశ్లేషకుడు దివాకరాచారి అని అన్నారు. ప్రముఖ విమర్శకురాలు పి.జ్యోతి మాట్లాడుతూ దివాకరాచారి కవిత్వంలో వస్తువైవిధ్యం అపారం. ముఖ్యంగా మహిళల మీద గౌరవంతో, ప్రేమతో రాసిన కవితలు దీనిలోచాలా ఉన్నాయి. అమ్మ – భార్య – కూతురు- మనవరాలు మీద సృజించిన కవితలలో సున్నితత్వం ఉంది. నాలుగు తరాల మహిళల పట్ల కరుణ రసాత్మక హృదయంతో స్పందించారని తెలిపారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ దివాకరాచారి కవిత్వంలో సమాజంపై, రైతులపై ఉన్న ప్రేమతోపాటు , ప్రశ్నించే తత్వం కనబడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ మాట్లాడుతూ దివాకరాచారి మాకు కరోనా కాలంలో విస్తృతంగా కవిత్వం రాయడం ద్వారా పరిచయమయ్యారు. ఆయన కవిత్వంలో ఉన్న అభ్యుదయ కోణం అప్పటికి అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ సభలో ప్రముఖ కవులు డివి సుబ్బారావు, అబ్దుల్ రాజా హుసేన్, దాసరి మోహన్, కె.వంశీధర్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.