అభినందనలు తెలిపిన ప్రియాంకవర్గీస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో విద్యనభ్యసించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన గిల్లెల శ్వేతకు కెనడాలోని లావల్ యూనివర్సిటీలో డాక్టోరల్(వుడ్స్ సైన్స్) ఉచిత సీటు లభించింది. ఈ మేరకు ఆ ఇనిస్టిట్యూట్ డీన్ ప్రియాంకవర్గీస్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ములుగు ఫారెస్ట్ కాలేజీలో ఆమె మాస్టర్స్, మహారాష్ట్రలోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్ నుంచి బీఎస్సీ బ్యాచిలర్స్ పూర్తిచేశారని తెలిపారు. లావల్ వర్సిటీలో డాక్టర్ కపిల్ సిహాగ్, డాక్టర్ సుమిత్ యాదవ్ మార్గదర్శకత్వంలో శ్వేత డాక్టరల్ ప్రోగ్రామ్ చేయనున్నారు. పూర్తి స్కాలర్షిప్, ఫీజు మినహాయింపుతో ప్రతిష్టాత్మకమైన విదేశీ విశ్వవిద్యాలయంలో డాక్టోరల్ సీటు పొందినందుకు ఆమెను ప్రియాంక వర్గీస్ అభినందించారు. ఆమె విజయం ములుగు కళాశాలలోని విద్యార్థులందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.