వర్సిటీల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

Efforts to solve the problems of the faculty of universities– కొన్ని అంశాలపై వారం రోజుల్లో సమావేశం
– రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
– విద్యాసంస్థల్లో ఎన్నికలుండాలి :
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ చెప్పారు. దీర్ఘకా లికంగా పెండింగ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ”సమకాలీన ఉన్నత విద్యాస వాళ్లు- పరిష్కారాలు” అనే అంశంపై వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు మాట్లాడారు. అధ్యాపకుల సమస్యలను సానుకూలంగా విన్న వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. త్వరలోనే సాధ్యమైనంత వరకు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని అంశాలపై వారం రోజుల్లోనే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అధ్యాపకుల నియామకాల విషయం రాష్ట్రపతి పరిధిలో ఉందని, తిరిగి శాసనసభలో బిల్లు పెట్టే విషయమై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అనుభవం కలిగిన అధ్యాపకులు ఉద్యోగ విరమణ పొందడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. సీపీఎస్‌ విషయంలో అతిత్వరలో పరిష్కారం ఉంటుందన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లింపు.. ఆరోగ్య కార్డుల కోసం కూడా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న 15 రాష్ట్ర విశ్వవిద్యాలయాల తరఫున సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని స్పష్టం చేశారు. భావజాలంతో సంబంధం లేకుండా.. విద్యార్థులకు రాజకీయ భాగస్వామ్యం లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, దీని పర్యవసానాలు భవిష్యత్తు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటా ఉపాధ్యక్షుడు ప్రొ. జి.మల్లేశం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అధ్యాపకుల నియామకాలు, సీపీఎస్‌, ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు, యూజీసీ బకాయిల విడుదల, ఆరోగ్యకార్డుల జారీ తదితర అంశాలపై విపులంగా మాట్లాడారు. ఉన్నత విద్యాసవాళ్లు, సమస్యలు, పరిష్కారాలు సహా సామాజిక, ఆర్థిక, సమకాలీన అంశాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ ఒకే గొంతుక వినిపించేందుకు నూతన వేదికను ఈ సమావేశం ప్రకటించింది. రాష్ట్ర ఆల్‌ యునివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఏయూటీఏ) ఏర్పాటు చేస్తున్నట్టు సమావేశంలో చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ప్రొ.విద్యాసాగర్‌, అప్పారావు, చెన్నప్ప, కాశీం, మాధవిలత, రబింద్రనాథ్‌ సోలొమన్‌, జమీల్‌, సబీనాహెరాల్డ్‌, వై.ప్రశాంతి, అలియా బేగం, మహేందర్‌ రెడ్డి, సైదానాయక్‌, మద్దిలేటి హాజరయ్యారు.ఔటా నుంచి ప్రొ. సరస్వతమ్మ, సూర్యాధనుంజరు, సీహెచ్‌.శ్రీనివాస్‌, చలమల్ల వెంకటేశ్వర్లు, జెవి వెంకటేశ్వర్‌రావు, మంగు, లావణ్య, నర్సింహులు హాజరయ్యారు.