– కాంగ్రెస్, బీజేపీ భౌతికదాడి ఆరోపణలు
భోపాల్ : మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం వేడేక్కుతున్నది. ఇప్పటి వరకు మాటల యుద్ధానికి పరిమితమైన రాజకీయ పార్టీలు భౌతిక దాడుల వరకు వెళ్తున్నాయి. ముఖ్యం రెండు ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య కొట్లాట పంచాయితీలు చోటు చేసుకుంటున్నాయి. గ్వాలియర్-ఛంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఇదే ఘటన చోటు చేసుకున్నది. అధికార బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రీతమ్ లోధి.. కాంగ్రెస్ పార్టీ వారు తనపై దాడికి దిగారని ఆరోపించారు. కరార్ఖేడా గ్రామంలో తన మద్దతుదారులతో ఉన్న సమయంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.పి సింగ్ ‘కక్కాజు’ అనుచరులు తనపై దాడికి దిగారని తెలిపాడు. ఈ దాడిలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడినట్టు చెప్పాడు. అయితే, ‘కక్కాజు’ స్వంత గ్రామానికి వచ్చి లోధి వర్గీయులే ప్రచారం సందర్భంగా రభస సృష్టించారని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యారోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలైన ఉమాభారతి దూరపు బంధువైన లోధి.. పిచ్చోరే నియోజకవర్గం నుంచి అధికార పార్టీ టికెట్పై వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు.