టీఎస్‌యూఈఈయూలో చేరిన విద్యుత్‌ కార్మికులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌యూఈఈయూ)లో వివిధ సంఘాలకు చెందిన విద్యుత్‌రంగ అన్‌మ్యాన్డ్‌ కార్మికులు పెద్ద సంఖ్య చేరారు. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరంతా తమ సమస్యల పరిష్కారం టీఎస్‌యూఈఈయూతోనే సాధ్యమౌతుందని విశ్వసిస్తూ చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కే ఈశ్వరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ స్వామి, కంపెనీ నాయకులు రాంచంద్రనాయక్‌, శివకృష్ణ తదితరులు హాజరయ్యారు. వీరి సమక్షంలోనే వారంతా యూనియన్‌లో చేరారు. యూనియన్‌ అధ్యక్షులు ఈశ్వరరావు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్‌మ్యాన్‌ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, చనిపోయిన, అంగవైకల్యం అయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ, స్కిల్డ్‌ వర్కర్ల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.