నవతెలంగాణ- హైదరాబాద్: వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయనుంది. నెట్స్ లో రోహిత్ శర్మకు గాయమైనట్టు వార్తలు రావడంతో కొంచెం ఆందోళన నెలకొన్నా, రోహిత్ టాస్ కు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ కు టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. అటు, వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్నప్పటికీ, ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతోంది. ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడి అన్నింట్లోనూ గెలిచిన టీమిండియా… నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై నెగ్గితే సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడి కేవలం ఒకదాంట్లోనే నెగ్గింది. ఇవాళ్టి మ్యాచ్ తో కలిపి ఇంగ్లండ్ ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, అన్నింట్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ఏవైనా సెమీస్ చాన్సులు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
తుది జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ
ఇంగ్లాండ్: డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియాన్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్