న్యూఢిల్లీ : భారత రచయిత్రి అరుంధతీ రాయ్ కు 45వ యూరోపి యన్ ఎస్సే ప్రైజ్ లైఫ్టైమ్ ఎచీవ్ మెంట్ లభించింది. ఛార్లెస్ వైల్లాన్ ఫౌండేషన్ ఈ విషయాన్ని ప్రకటిం చింది. అజాదీ (2021) పేరుతో ఆరుంధతి రాయ్ రాసిన వ్యాసాల ఫ్రెంచ్ అనువాదానికి ఈ అవార్డు లభించింది. ‘అరుంధతీరాయ్ తన వ్యాసాల్లో ఫాసిజం, దాని మార్గాన్ని విశ్లేషించడం ద్వారా వాటిని పోరాట రూపంగా ఉపయోగించారు. ఆమె వ్యాసాలు నిర్మాణాత్మకంగా ఉన్నాయి. మన జీవితాల్లో ఎక్కువగా ఉండే సమస్యలను ఎంచుకున్నారు. ఆమె వ్యాసాలు అనేక మంది వ్యక్తులను ప్రతిబింబిస్తున్నాయి’ అని ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది. అరుంధతి రాయ్ రాజకీయ చర్యల్లో నిబద్ధతను కూడా ఫౌండేషన్ ప్రశంసించింది. పెరుగుతున్న నిరంకుశతత్వం, స్వేచ్ఛ అర్థాల గురించి అరుంధతి రాయ్ అజాదీ వ్యాసాల్లో ప్రస్తావించారు. సెప్టెంబరు 12న స్విట్జర్లాండ్లో అవార్డును ఆమె అందుకుంటారు.