నవతెలంగాణ – హైదరాబాద్
థర్డ్ జెండర్లకు వైద్య విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ విభాగానికి చెందిన తనను మహిళల విభాగంలో కలిపేశారని పేర్కొంటూ ట్రాన్స్జెండర్ డాక్టర్ కొయ్యల రుత్జాన్ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళల విభాగంలో కాకుండా థర్డ్ జెండర్ విభాగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్భుయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సాగరిక వాదనలు వినిపిస్తూ థర్డ్ జెండర్ల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పోస్ట్ గ్రాడ్యుయేట్ రెగ్యులేషన్ – 2000ను రూపొదించిందని పేర్కొన్నారు. ఆ తీర్పు ప్రకారం థర్డ్ జెండర్లను ప్రత్యేక విభాగంగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఇప్పటికే ఎస్సీ క్యాటగిరీ కింద రిజర్వేషన్ ఉపయోగించుకున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.