అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

– బెంగాల్‌లో ఐదుగురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఒక అక్రమ బాణా సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలోని ఎగ్రా వద్ద మంగళవారం ఈ దారుణం జరిగింది. ఈ పేలుడు చాలా తీవ్రంగా ఉందని, బాణా సంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న నివాస భవనం పూర్తిగా కూలిపోయిందని పోలీసులు తెలిపారు. రాష్ట్ర పర్యావరణ మంత్రి మానస్‌ రంజన్‌ భునియా ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే, ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న అక్రమ బాణా సంచా తయారీ కేంద్రాలు గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అటువంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి తెలిపారు.