నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే వాదనలు సాగాయి. తాజాగా మరోసారి కూడా ధర్మసనం ముందు విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టు రోస్టర్లో మార్పులు జరిగాయి. ఈ రోజు నుంచి విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టును మారుస్తూ శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా నలుగురు జడ్జిలు రానున్నారు. అన్ని బెయిల్ పిటిషన్లు, 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన కేసులను విచారించే బాధ్యతను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును అప్పగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాకలు చేసిన అనుబంధ పిటిషన్పై జస్టిస్ టి. మల్లికార్జున రావు విచారించనున్నారు.