![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG_20231103_133210.jpg)
నవతెలంగాణ-గోవిందరావుపేట : అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు వార్తలు రాస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని లక్నవరం పంచాయతీ ఉపసర్పంచ్ కట్ల జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర లో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాను దుంపలగూడెం గ్రామంలో రెడ్డి సంఘం కుల పెద్ద గాను సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నానని అన్నారు. ఈ మధ్యకాలంలో గ్రామంలో మేడ శ్రీనిధి మృతి విషయంలో ఆమె కుటుంబ సభ్యులు మరియు పలువురు విలేకరులు అసత్య ఆరోపణలు తప్పుడు వార్తలు రాస్తూ వాస్తవాలను గ్రహించకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. శ్రీనిధి చనిపోయినప్పుడు కుల పెద్దగా నా వంతు బాధ్యతగా పాల్గొన్నారు తప్ప మరి ఏమీ లేదని అన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడం వల్ల శ్రీనిధి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపగా గ్రామంలో రెడ్డి సంఘం మరో పెద్దమనిషి వద్ద ఆర్ఎంపీ డాక్టర్ ను పిలిచి మరియు మృతురాలి కుటుంబ సభ్యులు బంధువు మాట్లాడుకొని అమ్మాయి అత్తగారు ఆస్తుల విషయంలో పంచాయతీ పెట్టగా ఇరువురికి అనుకూలంగా తీర్మానం కూడా చేయడమైనదని అన్నారు. ఆరోజు అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా స్పందించని మృతురాలి కుటుంబ సభ్యులు వారం రోజుల తర్వాత వార్త, మన దునియా, మన తెలంగాణ పత్రిక విలేకరులతో తప్పుడు వార్తలు రాయిస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ నన్ను అభాసపాలు చేస్తున్నారని అన్నారు. పోస్టుమార్టం జరగకుండా ఆర్.ఎం.పి డాక్టర్ ను కాపాడుతున్న అంటూ వార్తలు రాసిన పాత్రికేయులు నా వివరణ కోరకపోవడంలో ఆంతర్యం ఏంటని అన్నారు. అంతేకాక వార్త విలేఖరి కళ్లెం రవి మరియు మన తెలంగాణ విలేఖరి తుక్కాని ఎల్లారెడ్డి మన దునియా విలేఖరి నీపై వార్తలు రాయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తూ నన్ను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. మృతురాలి తాత ఎల్లారెడ్డి నాయనమ్మ ఆదిలక్ష్మి బాబాయ్ మధు నాపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. మృతురాలి బంధువులపై మరియు సంబంధిత పత్రిక విలేకరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా గౌరవ కోర్టు ద్వారా కూడా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపారు.
విచారణలో రుజువైతే చర్యలు తప్పవు
ఎస్ ఐ షేక్ మస్తాన్
కట్ల జనార్దన్ రెడ్డి పేర్కొన్న విధంగా సంబంధిత ఆధారాలతో పసర పోలీస్ స్టేషన్లో పిటిషన్లు స్వీకరించి కౌంటర్ ఫైల్ ఇవ్వడం జరిగింది. విచారణ ప్రారంభిస్తాం విచారణలో జనార్ధన్ పేర్కొన్న విధంగా రుజువైతే నిందితులపై చర్యలు తప్పవని అన్నారు.