నవతెలంగాణ – వరంగల్: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వరంగల్లో నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ‘నేను వరంగల్-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మామునూరు ఎయిర్పోర్టు ఏమైంది మోడీ? అంటూ ఫ్లెక్సీలు వెలశాయి. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏది?, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పర్యటనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా నేడు ములుగులో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ హాజరుకానున్నారు.