40 వేల పేజీల్లో సమాధానం !
ఇండోర్ : సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారులు ఏకంగా 40 వేల పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది. అధికారులు తన దరఖాస్తుకు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సిన అవసరం లేకుండాపోయింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఇండోర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కు ఓ దరఖాస్తు చేశారు. కరోనా సమయంలో ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర మెటీరియల్స్ కోసం జారీచేసిన టెండర్లు, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగారు. అధికారులు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఫస్ట్ అప్పిలేట్ ఆఫీసర్ శరద్గుప్తాను ఆశ్రయించారు. అభ్యర్థనను అంగీకరించిన శరద్గుప్తా.. దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ‘డాక్యుమెంట్లను తీసుకెళ్లేందుకు నా కారును తీసుకురావాల్సి వచ్చింది. డ్రైవరు సీటు తప్ప కారు మొత్తం డాక్యుమెంట్లతో నిండిపోయింది’ అని ధర్మేంద్ర శుక్లా తెలిపారు. నిర్దేశిత సమయంలోగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు రూ.80 వేలు నష్టం వచ్చేలా చేసిన సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పిలేట్ ఆఫీసర్ శరద్ గుప్తా ఆదేశించారు.