62 ఏండ్ల తర్వాత తొలిసారి

– ఢిల్లీ, ముంబైకు ఒకేసారి రుతుపవనాలు
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలకు చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా నగరాలను నైరుతి రుతుపవనాలు తాకడంతో రెండు చోట్లా ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏండ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన సంఘటన చివరిసారిగా జూన్‌ 21, 1961న ఢిల్లీ, ముంబైల మీదుగా ఒకేసారి రుతుపవనాలు ప్రవేశించినప్పుడు జరిగిందని వాతావరణ కార్యాలయం తెలిపింది. రెండు నగరాలు ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రుతుపవనాలు సాధారణంగా జూన్‌ 27న ఢిల్లీని తాకగా, ఈ ఏడాది షెడ్యూల్‌ కంటే రెండు రోజులు ముందుగానే వచ్చాయి. మరోవైపు ముంబైకు రుతుపవనాలు వచ్చే తేదీ జూన్‌ 11. అయితే ఈ సారి రెండు వారాలు ఆలస్యంగా నగరంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఢిల్లీలో వాతావరణ సూచన
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆదివారం ఉదయం కురిసింది. ఉదయం 5:30 గంటల వరకు, నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి ఢిల్లీలోని పాలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐఎండి డేటా ప్రకారం.. రుతుపవనాలు గతేడాది జూన్‌ 30న, 2021లో జులై 13న, 2020లో జూన్‌ 25న, 2019లో జులై 5న, 2018లో జూన్‌ 28న ఢిల్లీని ఆవరించాయి. ఆదివారం (జూన్‌ 25), సోమవారం (జూన్‌ 26) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయబడింది. బుధవారం (జూన్‌ 27), గురువారం (జూన్‌ 28) ఎల్లో అలర్ట్‌ జారీ చేయబడింది.
ముంబైలో వాతావరణ సూచన
రెండు వారాల ఆలస్యం తర్వాత రుతుపవనాలు ముంబైకు చేరుకున్నాయి. సాధారణంగా జూన్‌ 11న రుతుపవనాలు చేరాల్సి ఉంది. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల నీటి ఎద్దడి ఉన్నట్లు సమాచారం. ముంబైకి ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.