నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు.. అనంతరం మాట్లాడారు. మెదక్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం ఈ సారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎప్పటికి కొనలేరన్నారు మంత్రి హరీష్ రావు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలాగా చేసి చూపించిన వ్యక్తి సీఎం కేసీఆర్. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కరువులు, కర్ఫ్యూలు అని చెప్పారు. తెలంగాణలో మూడు గంటల కరెంట్ చాలు అన్నోళ్లు ఓ దిక్కున్నారు…మూడు పంటలు పండాలన్న సీఎం కేసీఆర్ మరో దిక్కున్నారని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఎవరిని గెలిపించాలో మీరే నిర్ణయించుకోవాలని కోరారు మంత్రి హరీష్ రావు.