నవతెలంగాణ – ఇటలీ
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ (86) కన్నుమూశారు. కొద్ది రోజులుగా లూకేమియాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇటలీకి నాలుగుసార్లు ప్రధానిగా పని చేశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందారు. ఇటలీలో ప్రస్తుతం మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. స్థానికంగా తిరుగులేని మీడియా అధినేతగా ఎదిగారు. ఆయన జీవితం అనేక వివాదాస్పద అంశాలతో ముడివడి ఉంది. విలాసాలు, లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు ఎదుర్కొన్నారు. మిలాన్ నగరంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు బెర్లుస్కోనీ. ఆయన అంతకుముందు క్రూజ్ షిప్ లో గాయకుడిగా ఉన్నారు. నిర్మాణ రంగం, మీడియా రంగంలో ప్రవేశించి అత్యంత ధనికుడిగా ఎదిగారు. 1994లో ఫోర్జా ఇటాలియా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది మొదటిసారి ప్రధానిగా అధికారం చేపట్టారు.