నవతెలంగాణ – న్యూఢిల్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్ట్ జట్టులో మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు సలహాలు ఇస్తున్నారు. కొంత మంది కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ స్పందిస్తూ… జట్టులోకి క్రమంగా యువ ఆటగాళ్లను తీసుకురావాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గంగూలీ కీలక సలహా ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన మాటను పాండ్యా వింటున్నాడనుకుంటానని తెలిపారు. ఒక్క ఓటమితో టీమిండియా సత్తాను తప్పుపట్టలేమని… భారత జట్టులో ఎంతో ట్యాలెంట్ ఉందని గంగూలీ చెప్పారు.