– శ్రీరామసాగర్, నిజాంసాగర్కు పెరిగిన ప్రవాహాం
– రైతన్నలకు వరంగా వర్షాలు
– ముమ్మరంగా వ్యవసాయ పనులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి బేసిన్ ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలు కళకళ్లాడుతున్నాయి. నిండు కుండలా కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరుతున్నది. పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకూ వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 1,21,008 ఇన్ ఫ్లో ఉండగా, 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను,63.47 టీఎంసీలు నీళ్లు నిల్వఉన్నాయి. ఇప్పటికే నిండిన నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22.440 క్యూసెక్కుల వరద వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద వస్తుండగా, 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.48 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు. అదేవిధంగా మిడ్ మానేరు రిజర్వాయర్ లో 27.50 టీఎంసీల నీటీ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు రైతన్నలకు వరంగా మారాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఈమేరకు బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన జారీచేసింది.