– సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతోంది
– సమ్మె నోటీస్ను ఎంపీడీవోకు అందజేసిన జెఏసీ జిల్లా ఛైర్మన్ తునికి మహేష్
నవతెలంగాణ -కోహెడ
గ్రామపంచాయితి కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జెఏసీ జిల్లా ఛైర్మన్ తునికి మహేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయితి కార్మికులకు జీవో నెం. 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సమ్మె నోటీస్ను ఎంపీడీవో మధుసూదన్కు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. అలాగే కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. పెండిరగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. బిజెపి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో అట్టహాసంగా కార్యక్రమాలను ప్రారంభించి ఫొటోలకు ఫోజులిస్తూ వాటి యాడ్స్ కొరకు వేల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిందన్నారు. కేంద్రంలో బీజెపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. పంచాయితీ సిబ్బందికి అడుగడుగునా వివక్షతే ఎదురైందన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు ప్రజలు, ఇతర తరగతుల కార్మికవర్గం, ఉద్యోగులు సంఫీుభావం తెలియజేసి అండగా నిలబడాలని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకపోతె జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జేఏసీ జిల్లా కో కన్వీనర్ బాకీ యాదగిరి, మండల అధ్యక్షుడు తలారి అనిల్, మండల కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు మహేశ్వరి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.