– ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. మహిళా కూలీల రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రూ.600 కూలి, 200 రోజుల పనిదినాలు సాధించాలని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా హసన్పర్తిలోని ఐలమ్మ నగర్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కూలీల రాష్ట్ర సదస్సును నాయకులు స్వరూప అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సదస్సుకు ముందుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పతాకాన్ని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బప్పని పద్మ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య ఛాయ చిత్రానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో పుణ్యవతి మాట్లాడుతూ.. పాలకుర్తిలో రామచంద్రారెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ వారసులుగా.. కూలి కోసం, పనిదినాల కోసం పోరాటం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దొంగ నాటకాలాడుతూ కార్మికులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ అదానీ, అంబానీలను ప్రపంచ కుబేరులుగా చేయడానికి దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్ధలను వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీకి రుణాలిస్తామన్న ప్రభుత్వాలు రూ.2ల వడ్డీకి ఇస్తూ మహిళలను మోసం చేస్తున్నారన్నారు. మనకివ్వడానికి సర్కార్ వద్ద డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం కట్టించారని ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్న పోరాటాల్లో మహిళా కూలీలే అధికంగా పాల్గొంటున్నారని, భవిష్యత్తులోనూ హక్కుల సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కోరారు.
ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు టి. జ్యోతి మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో జరుగుతున్న భూ పోరాటాల్లో మహిళా కూలీలే అధికంగా పాల్గొంటున్నారన్నారు. 60 గజాల స్థలం కోసం పోరాడే మహిళలది ఆత్మగౌరవ పోరాటమన్నారు. ఒక ఎకరం భూమి సాగు చేయడానికి 52 మంది కూలీలు అవసరమని ఒక అధ్యయనం తెలిపిందని, కానీ ప్రస్తుతం 16 మంది కూలీలు మాత్రమే పనిచేస్తున్నారని, వారందరూ మహిళా కూలీలే కావడం విశేషమన్నారు. ఎకరానికి 36 మందికి కూడా పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గించిస్తూ దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదించినా, అది ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. జనగణన పూర్తై, నియోజకవర్గాల పునర్విభజన జరిగాకే అమలు చేస్తామని ప్రధాని మోడీ చెప్పడం మహిళలను మోసం చేయడమేనన్నారు. మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయని, దాంతో సామాన్యులు సరుకులు కొనలేక పస్తులుండాల్సి వస్తుందని తెలిపారు. గూడు కావాలని మీరు చేస్తున్న ఈ పోరాటానికి ఐద్వా సంపూర్ణ మద్దతు ఉంటుందని, మీ పోరాటం జయప్రదం కావాలని కోరారు. ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సారంపల్లి వాసుదేవరెడ్డి, గుమ్మడిరాజుల రాములు, డి. తిరుపతి, పుల్లా అశోక్ తదితరులు పాల్గొన్నారు.