నవతెలంగాణ -మంగపేట
తమ సమస్యల పరిష్కారం కోసం 19 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని 25 గ్రామపంచాయతీలకు చెందిన కార్మికులు సుమారు వంద మందికి పైగా మండల పరిషత్ కార్యాలయంలోన దీక్షా శిభిరం నుండి మండల కేంద్రంలోని ప్రతి షాపు తిరుగుతూ బిక్షాటన చేశారు. ఈ సందర్బంగా జిల్లా గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ సభ్యడు కొంరెల్లి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 19 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల సాధనకు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నాయమైన తమ 17 కోర్కెలను తీర్చేవరకు నిరసన దీక్షలు విరమించేదిలేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మండల సంఘం అద్యక్ష, కార్యదర్శులు బోడ ఆదినారాయణ, మద్దెల లక్ష్మయ్య, సభ్యులు అశోక్, శ్రీను, మహేష్, రవి, రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.