గ్రూప్‌-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
గ్రూపు-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్‌ కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో గ్రూపు-4 పరీక్షల నిర్వహణపై, ఎగ్జామినేషన్‌, చీప్‌ సూపరిటెండెంట్‌లు, లైసెన్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జులై 1 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నాం 2. 30 నుంచి 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 18,120 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగానూ మొత్తం 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, పరిసర ప్రాంతంలో గల జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియమ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు. అధికారులు నేడు ముందస్తుగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు సరి చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ ఫోన్లు, అనుమతించరాదని అన్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం 9:45 గంటలకు, మధ్యాహ్నం 2:15 తర్వాత ఎవరిని అనుమతించరాదన్నారు.అధికారులందరూ సమన్వయంతో పని చేసి గ్రూప్‌-4 పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, డిఆర్డిఓ కష్ణన్‌లతో పాటు పరీక్ష నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.