నవతెలంగాణ : గాజా నుంచి ఇజ్రాయిల్ దిశగా డజన్ల సంఖ్యలో రాకెట్లను ఫైర్ చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. రాకెట్ల దాడితో అప్రమత్తమైన దక్షిణ ఇజ్రాయిల్లో సైరన్లు మోగాయి. టెల్ అవివ్ ప్రాంతంలో కూడా అలర్ట్ ప్రకటించారు. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్ ఆ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అషేక్లాన్ నగరంలో చెలరేగిన మంటల్ని ఆర్పేందుకు ఇజ్రాయిల్ ఫైర్ఫైటర్లు రంగంలోకి దిగారు. కాలిపోయిన వాహనాల నుంచి భారీ స్థాయిలో నల్లటి పొగ చిమ్ముతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్లోకి భారీగా ఉగ్రవాదులు చొరబడినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. స్థానికులు ఇండ్ల వదిలి బయటకు రావొద్దు అని ఐడీఎఫ్ ప్రకటన చేసింది. దక్షిణ ప్రాంత నగరమైన సీడెరట్లో హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దేశంలోకి ఎంత మంది ఉగ్రవాదులు చొరబడ్డారో ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం హమాస్, ఐడీఎఫ్ మధ్య భీకర పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల నుంచి ఏకధాటికి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ఫైర్ చేస్తున్నట్లు ఇజ్రాయల్ తెలిపింది. దీంతో జెరుసలాం, బీర్షీబా, టెల్ అవివ్ నగరాల్లో సైరన్లు మోగించారు. దాదాపు 5 వేల రాకెట్లతో హమాస్ దాడి చేసినట్లు తెలుస్తోంది.