– రవాణాకు తీవ్ర అంతరాయం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో రెండు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తోంది. ఈ భారీ హిమపాతంతో కాశ్మీర్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కాశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్మార్గ్లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైంది. కొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయ వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి మరింత భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని అధికారులు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాతే హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు. జమ్ముకాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి.