నవతెలంగాణ – హైదరాబాద్: చిన్నారుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక విభాగం ఉండాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సంక్షేమ గృహాల్లో నెలకొన్న పరిస్థితులపై న్యాయసేవాధికార సంస్థ సమర్పించిన నివేదికపై హైకోర్టు విచారణ చేపట్టింది. చైల్డ్ హోమ్లన్నీ ఎన్జీవోలే నిర్వహిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల సంక్షేమ గృహాలు లేవని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని చైల్డ్ హోమ్లలో దయనీయ స్థితి ఉందని నివేదికలో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. మానవ అక్రమ రవాణా పలు దేశాల్లో అతిపెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక విభాగం ఉండాలని న్యాయస్థానం సూచించింది. నియంత్రణ, బాధితులను రక్షించడం, పునరావాసం, సమాజంలో అందరితో కలసేలా చేయడం ఎంతో కీలకమని తెలిపింది. దీనిపై దర్యాప్తు, న్యాయ అధికారుల్లోనూ అవగాహన పెంచాలని సూచించింది. చిన్నారుల అక్రమ రవాణాపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి ఉత్తర్వులిస్తామని పేర్కొన్న న్యాయస్థానం.. విచారణను జులై 20కి వాయిదా వేసింది.