వికలాంగులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వికలాంగులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్రఉపాధ్యక్షులు టి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.ఒకే కుటుంబంలో ఎక్కువమంది ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పెళ్లయిన కుటుంబాలు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు.
నియోజకవర్గ కేంద్రాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టినా ఎందుకు పంపిణీ చేయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేరుతో ఇండ్ల స్థలాల పంపిణీ జీవోను ప్రభుత్వం రద్దు చేసిందనీ, దాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం వచ్చే నెల మూడున కలెక్టరేట్‌ల ముట్టడి నిర్వహించనున్నట్టు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి కె వెంకట్‌, ఎం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సదరం క్యాంపుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. వికలాంగుల సామజిక భద్రత కోసం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9 వరకు రాష్ట్ర వ్యాపితంగా గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలనీ, జూలై 10న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వికలాంగులను సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అర్‌ వెంకటేష్‌, సాయమ్మ, జే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశప్ప, వరమ్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఉపేందర్‌, దశరథ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.