నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇండ్లు టార్గెట్గా దాడులు జరగ్గా.. ఈనెల 13న ఉదయం నుంచి నగరంలోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది ఇండ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇండ్లలో కూడా సోదాలు జరిగాయి. గత మూడురోజులుగా మంత్రి సబిత అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా.. నేటితో సోదాలు ముగిశాయి. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.