పిచ్చోళ్ల విమర్శలకు స్పందించను

For crazy criticism do not respond– వాళ్లంతా ఎన్నికలప్పుడే వస్తారు..
– ప్రతి ఎన్నికల్లోనూ నాపై వక్ఫ్‌భూముల కబ్జా నిందారోపణలు
– రాష్ట్రంలో 90సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాం..
– ఉమ్మడి జిల్లాలోని 13నియోజకవర్గాలనూ క్లీన్‌స్వీప్‌ చేస్తాం : పౌరసరఫరాలు, బీసీసంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘నన్ను తిట్టి.. నాపై నిందారోపణలు చేసి ఉనికి చాటుకునే పిచ్చోళ్ల మాటలకు నేను స్పందించను. వాళ్లంతా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వచ్చి అరవడమే తప్ప.. ఎన్నికలయ్యాక మళ్లీ కనిపించకుండా పోతారు. ప్రతి ఎన్నికలప్పుడూ.. నాపై వక్ఫ్‌భూముల కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. నోటికి ఎంతవస్తే అంతా మాట్లాడుతున్నారు. నేను వందల సార్లు, వంద వేదికలపై వివరణ ఇచ్చాను. దేవుని సొమ్ము తింటే పాపం ఊరికే పోదు’ అని పౌరసర ఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలే పట్టంగడుతారని, 90కిపైగా సీట్లు గెలిచి మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ 13నియోజకవర్గాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్‌లో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే ఎవరూ ఊహించని విధంగా తమ పార్టీలోకి కీలకనేతల చేరికలు ఉంటాయ ని చెప్పారు.రాజకీయం, పాలనా అనుభవం లేని కొంతమంది అజ్ఞానులు చేసే విమర్శలకు తాను స్పందించబోమనన్నారు. గతంలో వారి హయాంలో లక్ష రూపాయల రోడ్డు మంజూరు చేసి అందులో రూ.60వేలు మింగి.. రూ.30వేలతోనే రోడ్డు వేసేవారని విమర్శించారు. అలాంటి వారికి అధికార ం ఇస్తే కరీంనగర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి స్టీల్‌ తీగలను అమ్ముకునే రకమని అన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందే 2008లోనే అన్ని రికార్డులూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కొనుగోలు చేశానన్నారు. ఆ ప్రాంతంలో మైనార్టీ ఇల్లుగానీ, చిన్న దర్గాగానీ లేదన్నారు. రైతుల నుంచి పక్కా పత్రాలతో కొనుగోలు చేసిన భూములపై అనవసర ఆరోపణలు చేస్తున్నవారికి ఇప్పటికే కోర్టు నోటీసులు పంపానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు నిందారోపణలు చేస్తే.. శిక్ష పడుతుందని హెచ్చరించారు. వారిపై పరువు నష్టం సహా ఇతర శిక్షలు తప్పవన్నారు.
ఆగస్టు 16 నుంచి వెల్ఫేర్‌, అభివృద్ధి పనులు
ఈనెల 16 నుంచి నియోజకవర్గంలో వెల్ఫేర్‌, అభివృద్ధి పనులను వేగిరం చేస్తామన్నారు. 600 మంది కులవృత్తి లబ్దిదారులకు బీసీబంధు చెక్కులు అందిస్తామన్నారు. మైనార్టీలకు కుట్టుమిషన్లు, ఇతర ఉపాధి సాయాన్ని అందిస్తామన్నారు. మరోవైపు నగరంలో రూ.125కోట్లతో మిగిలిపోయిన మెయిన్‌రోడ్డు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. వీటితోపాటు మరో రూ.25కోట్లు బఫర్‌ నిధి కింద వేరు చేశామని, ఎవరు తమ ఇంటి ముందు సీసీ రోడ్డు కావాలని అడిగినా వెంటనే నిర్మిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టూ లేక గృహలక్ష్మి లాంటి స్కీంపై బురదజల్లుతూ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ పథకం నిరంతర ప్రక్రియగా ఉంటుందని ఇదివరకే ప్రకటించామని చెప్పారు.