మట్టి కుండలోని నీటిని తాగితే?

ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉండటం సర్వసాధారణం.. అయితే ఉంది కదా అని విరివిగా వాడటం కూడా ఆరోగ్యానికి శ్రేయష్కరం కాదు. అందులో ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ చల్లని నీటిని తాగాలనే ఆరాటపడుతుంటారు. అవి ఫ్రిడ్జ్‌ లో పెట్టిన నీరు అయితే మాత్రం ఆరోగ్యాన్ని చేజేతులారా సమస్యల్లో నెట్టుకున్నట్లే.. దానికి బదులుగా కుండలో నీటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చల్లని నీటి కోసం మట్టి కుండను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
పీహెచ్‌ సమతుల్యత : మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. బంకమట్టి ఆల్కలీన్‌ స్వభావం కలిగి ఉండటంతో ఇది ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది. బంకమట్టి కుండలోని నీటి పీహెచ్‌ను సమతుల్యం చేస్తుంది. తద్వారా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సంబంధిత సమస్యను దూరం అవుతాయి.
ఖనిజాలు : మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిలో ఖనిజాలు, పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ప్రతిరోజూ కుండ నీటిని తాగితే జీవక్రియ పెరుగుతుంది. మట్టి కుండ నీరు వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు.