– ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా, మహేందర్రెడ్డి
– కోటి వృక్షాచరణలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్యయంతో 256 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మంత్రి మహేందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కోటి వృక్షార్చనలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయని, ఈ రోజు 74వ పార్కును ప్రారంభించుకున్నామని తెలిపారు. 256 ఎకరాల విస్తీర్ణంలో 5.6 కి.మీ ఉన్న ఈ పార్కులో సుమారు 50 వేల రకాల మొక్కలు ఉన్నాయన్నారు. ట్రెక్కింగ్ ట్రాక్ 2 కి.మీ, వాకింగ్ ట్రాక్ 4 కి.మీ ఉందని వివరించారు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉండటంతో అర్బన్ లంగ్ స్పేస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని ట్రెక్కింగ్తో పాటు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్తో ఈ పార్కును అభివృద్ధి చేశామన్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్లో అదనపు ఆకర్షణగా నిలువనుందని తెలిపారు. పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, తదితర సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రి యల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, తదితరులు పాల్గొన్నారు.