నవతెలంగాణ -హైదరాబాద్: ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలుపు ఖాయమని.. అలాగే తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయం కూడా ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా.. ప్రజలు గెలవాలని బీఆర్ఎస్ కోరుకుంటోందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను కాకుండా తెలంగాణను గెలవాలని కోరుకుంటోందని.. అంటే ప్రజలు ఓడిపోయినా పరవాలేదనేది ఆ పార్టీ వైఖరి అంటూ విమర్శించారు. గత తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా అవి అర్హులకు కచ్చితంగా అందేలా చూశామని వెల్లడించారు. కేసీఆర్ ప్రవేశపెట్టినన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు.