నవతెలంగాణ – హైదరాబాద్
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. ‘చంద్రుడి కోసం చంద్రయాన్-3 రోవర్ భారత్లో తయారైంది. ఇప్పుడు అది ల్యాండర్ నుంచి బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది’ అని ఇస్రో తన ట్వీట్లో పేర్కొంది. చంద్రుడి గుట్టు విప్పడంలో ప్రజ్ఞాన్ రోవర్ ముఖ్య పాత్ర పోషించనుంది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది. చంద్రునిపైకి ఇప్పటికే అమెరికా, యూఎస్ఎస్ఆర్, చైనా రోవర్లను పంపాయి. కానీ, వీటిలో ఏ దేశమూ దక్షిణ ధ్రవ ప్రాంతంలో దిగలేదు. మొట్టమొదటిసారి భారతదేశమే ఆ ఘనత సొంతం చేసుకొన్నది. మొత్తంగా చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన మాడ్యూల్ను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా అవతరించింది. దీంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది.