– బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్
నవతెలంగాణ- పెన్ పహాడ్:
కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని బహుజనుల కన్నబిడ్డగా వస్తున్నానని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలోని మాచారం, దుపహడ్ గ్రామాలలో వివిధ పార్టీల నాయకులను ఆదివారం బీఎస్పీ లోనికి పార్టీ జెండాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరలు బహుజనులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కలిసి ఏనుగు గుర్తుపై ఓటు వేసి స్థానికుడైన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు కోలాట బృందాలతో, బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు భీమయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గండురి కృపాకర్, గండురి రమేష్, పార్టీ జిల్లా నాయకులు ఆవుల అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు భింపంగి నాగరాజు, మండల ఇంచార్జి రణపంగ శ్రవణ్, నాయకులు బాణాల విజయ్, మండ్ర మల్లయ్య, ఒగ్గు వెంకన్న, బొల్లక లింగయ్య, గుగ్గిళ్ళ శ్యాంసన్, యర్రయ్య, గుంజ వేణు తదితరులు పాల్గొన్నారు.