తప్పుదారి పట్టిస్తుంది

– యువతపై సోషల్‌ మీడియా ప్రభావం
– వారు సరైన జీవిత గమనాన్ని నిర్ణయించుకోలేకపోతున్నారు : అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : యువతపై సోషల్‌ మీడియా, సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల ప్రభావంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి ప్రభావంతో యువత సరైన జీవిత గమనాన్ని నిర్ణయించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. అలాగే, సరైన ఆత్మీయుల అన్వేషణలో తరుచూ తప్పుడు పనులకు దిగుతున్నారని తెలిపింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్‌ మంజూరు విచారణ సందర్భంగా న్యాయస్థానం పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ”ఈ దేశంలోని యువత వ్యతిరేక లింగానికి చెందిన వారితో స్వేచ్ఛా సంబంధానికి ఎర చూపడం, పాశ్చాత్య సంస్కృతికి లొంగిపోవడం, నిజమైన ఆత్మ సహచరుడిని కనుగొనకపోవడంతో తమ జీవితాలను పాడు చేసుకుంటున్న అనేక కేసులలో ఇది ఒకటి. సామాజిక మాధ్యమాలు, చలనచిత్రాలు ఆకట్టుకునే మనస్సుల ఊహాశక్తిని రేకెత్తిస్తుంది. వారు అదే ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తారు. కానీ అవి ప్రస్తుత సామాజిక ప్రమాణాలకు సరిపోవు” అని అలహాబాద్‌ హైకోర్టు వెల్లడించింది. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించడం వల్ల కలిగే పర్యవసానాల గురించి తెలియని యువతరం సోషల్‌ మీడియా, సినిమాల్లో చూపించే కంటెంట్‌కు ప్రభావితమై సంబంధాలలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించింది.