– అన్నా చెల్లెల్లను సన్మానిస్తున్న ఎంపీపీ రేణుకాతిరుపతిరెడ్డి, సర్పంచ్ పోతుల నర్సయ్య
– పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు
– వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి
నవతెలంగాణ-వీణవంక: పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన రైతు బిడ్డలైన అన్నా చెల్లెల్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషకరమని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరూ ముందుకెళ్లాలని ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల చంద్రయ్య-ఇందిర కుమారుడు శ్రావణ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్, వారి కుమార్తె నవత రాష్ట్ర ప్రభుత్వమైన ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. కాగా వారికి రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం సర్పంచ్ పోతుల నర్సయ్య ఆధ్వర్యంలో అన్నా చెల్లెల్లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సాధారణ రైతు బిడ్డలైన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదవాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో పాటు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, వార్డు సభ్యులు చింతల రాజయ్య, ఉగ్గి మమత సమ్మయ్య, అంబాల మధునయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కారోబార్ పోతుల నారాయణ, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.