సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్య రక్తహీనత. 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి ఆరు లేదా ఐదుకి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది.
– రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది. కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్తంత జాగ్రత్త పాటించి దానిని పెంచుకోవటం మంచిది.
– మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటి వాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్యా ఉండదు.
– ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి.
– నువ్వులు, బార్లి, బాదం పప్పు తినటం కూడా మంచిది. మాంసాహారులు, ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.
– ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివీ పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా ఇలాంటివి ఎక్కువగా తినాలి.
– బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహద పడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి.
– బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని ఔషధం. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్ కూడా రక్తాన్ని వద్ధి చేస్తాయి.
మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు.