– టికెట్లను అమ్ముకున్న వ్యక్తి రేవంత్రెడ్డి
– రేవంత్ రాకతో నిజమైన కార్యకర్తలందరికీ అన్ని అవమానాలే
– రేవంత్ వ్యవహార శైలి నచ్చకే రాజీనామా
– ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు రాజీనామా
– టీపీసీసీ సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్గౌడ్
నవతెలంగాణ-కొత్తూరు
టీపీసీసీ సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కొత్తూరులోని తన నివాసంలో అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ వ్యవహరిస్తున్న తీరు, ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని అన్నారు. ఆస్తులు అమ్ముకొని పార్టీ బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలలో మొదటి నుంచి కాంగ్రెెస్లో ఉన్న వారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని వాపోయారు. పార్టీ నుంచి వెళ్లి వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాధించుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. మాజీ పిసిసి సభ్యులు పొన్నాల లక్ష్మయ్య పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు హేయమైనదని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం వృద్ధులకు ఎంతో భరోసా ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుందని అంటున్న రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో కొత్తూరు సర్పంచ్గా గెలుపొందిన సమయంలోనే కొత్తూరుకు మెట్రో వాటర్ తీసుకువచ్చానని తెలిపారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో సైతం షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించానని చివరి సమయంలో గాడ్ ఫాదర్ లేక పోవడంతో తప్పిపోయిందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కౌన్సిలర్లు మాదారం నరసింహ గౌడ్, పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్, జండాగూడం అనిత శ్రీనివాస్ గౌడ్, సోమ్లా నాయక్, మోర జనార్దన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మీరాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ మాజీ కోఆర్డినేటర్ సద్దాం, మాదారం కష్ణ గౌడ్, యాసిన్, లతీఫ్, రవీందర్, పరశురాం తదితరులు ఉన్నారు.