నవతెలంగాణ- తిరుమలగిరి:
తుంగతుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి తమకు ఓటేయకపోతే మీకు ఏ రకమైన పథకాలు రానివ్వమని బెదిరిస్తున్నారని బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థి కడియం రామచంద్రయ్య ఆరోపించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని భాజాపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించటం లేదని పబ్లిక్ ప్లేస్లలో ప్రచారానికి పోస్టర్లు అంటించి గోడల మీద రాతలు రాసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక అధికారులు చూసి చూడకుండా ఉంటున్నారని ఆరోపించారు. అంతేగాక స్థానిక అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వారు ప్రచారానికి వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. ఇతర పార్టీలలో నా సాధారణ కార్యకర్తలు బీ ఆర్ఎస్ లో చేరకపోతే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తిరుమలగిరి లోని మామిడాల, తాటిపాముల, నందపురం గ్రామాల్లో ఈ విధమైన అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు.