పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

– స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో సీఆర్పిఎఫ్‌ 81 బెటాలియన్‌
నవతెలంగాణ-చర్ల
తమ తమ పరిసరాలను పరిశ్రమగా ఉంచుకోవాలని సీఆర్పిఎఫ్‌ 81 బెటాలియన్‌ కమాండెంట్‌ సంజీవ్‌ కుమార్‌ సూచించారు. ఆదివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాలలో తన జవాన్లతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం మాట్లాడారు. మన శుభ్రతే మనల్లి కాపాడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఎటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా ఉంటాయని ఆయన కోరారు. అక్టోబర్‌ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం అక్టోబర్‌ 1, 2 తేదీల్లో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాలతో పాటు జడ్పీహెచ్‌ఎస్‌ సత్యనారాయణపురం, గ్రామంలో సైతం ఎక్కడ అపరిశుభ్రం ఉండకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల అనుసరంగా వచ్చి మమ్మల్ని కలిసి మా సేవలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సెకండ్‌ కమాండెంట్‌ సునీల్‌, డిప్యూటీ కమాండెంట్‌ ప్యూస్స్‌, సంబుత్‌ సింగ్‌, వైద్యులు హెచ్‌ బర్ల, బి.తోపో, సర్పంచ్‌ పుల్లయ్య, సత్యనారాయణపురం పీహెచ్‌సీ వైద్యురాలు దివ్యనైనా, కార్యదర్శి హరిబాబుతో పాటు 125 మంది సీఆర్పిఎఫ్‌ 81 బెటాలియన్‌ జవాన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీజీ పిలుపు మేరకు కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆవరణలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. చెత్త చెదారం, పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆకాశవాణి కార్యక్రమనిర్వహణ, ఇంజనీరింగ్‌ సిబ్బంది, ఆర్జేలు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : స్వచ్ఛతా పక్వాడ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో గల 141/ఏ బెటాలియన్‌ సిఆర్పిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, పోలీస్‌ స్టేషన్‌, సిఆర్పిఎఫ్‌ బెటాలియన్‌, ఎంపీడీవో, మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఉన్న చెత్తాచెదారాలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్‌ ఎస్పీఎం భాష, ఏఎస్‌ఐ సంతోష్‌ సిరసత్‌, సిఆర్పిఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి : మండలంలోని స్థానిక రామచంద్ర డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సోనా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలోఎంపీడీవో రమేష్‌, లెక్చరర్‌ రమేష్‌, ఏపీఓ వీరన్న, సర్పంచులు తాటి పద్మ, కోరం చంద్రశేఖర్‌, పంచాయతీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీడీవో ముత్యాలరావులతో పాటు, ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, పంచాయతీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మణుగూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను మండలంలో విస్తృతంగా నిర్వహించారు. ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగిరెడ్డి, ఆర్‌ఐ లీలావతి స్వచ్ఛత ఈలో భాగంగా శ్రమదాన నిర్వహించారు. 14 గ్రామ పంచాయతీలలో రోడ్డు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, 14 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : పరిసరాలు శుభ్రంగా ఉంటే తరుణ వ్యాధులకు దూరం అవుతాయని, దీంతో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంతో ఆనందమయ జీవనం గడపవచ్చు అని వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ జె.హేమంత్‌ కుమార్‌ విద్యార్ధులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్చత హి సేవా నినాదం పిలుపుమేరకు, ఏక్‌ తారీక్‌-ఏక్‌ గంటే నియమంతో స్ధానిక వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పధకం ఆధ్వర్యంలో విద్యార్ధినీ, విద్యార్ధులు ఆదివారం గంట పాటు పరిసరాల శుభ్రత-పరిశుభ్రతలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో భాగంగా గంటపాటు 150 మంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు శ్రమదానం చేసారు. ముందుగా అశ్వారావుపేట పట్టణ వీధుల్లో స్వచ్ఛత పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె.హేమంత్‌ కుమార్‌ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ మూర్తి, ఈఓ గజవల్లి హరిక్రిష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ పర్యవేక్షకులు, ప్రొఫెసర్స్‌ ఎం.రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : పరిసరాలు, కళాశాలల పరిశుభ్రత అందరి బాధ్యతని ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ తోర్తి జాన్‌ అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం కళాశాల, నందు కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ యన్‌.యస్‌.యస్‌ కోఆర్డినేటర్‌ ఈసం నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరంగం రామలింగేశ్వర రావు ఆదేశాల మేరకు వన్‌ అవర్‌ శ్రమదాన్‌ ఫర్‌ స్వచ్ఛత (స్వచ్ఛత హీ సేవ) ప్రోగ్రాంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్స్‌ తోర్తి జాన్‌, విలియం ప్రసాద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, అధ్యాపకతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పినపాక : మండల వ్యాప్తంగా 23 గ్రామపంచాయతీలలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంపీఓ వెంకటేశ్వరరావు ఆదేశాలతో స్వచ్ఛత హీ సేవ వక్షోత్సవాలలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంపీఓ వెంకటేశ్వరరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.