– నిజామాబాద్లో గుర్తింపు
– పోలీసుల అదుపులో భార్యాభర్తలు
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడు నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట క్రాస్లోని ఓ ఫామ్హౌజ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న సల్మాన్ఖాన్-ఫరీదా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి అస్వస్థతగా ఉండటంతో సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాబును ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి సమయంలో మొదటి అంతస్తులో పెద్ద కుమారుడికి చికిత్స కొనసాగుతుండటంతో అక్కడే చిన్న కొడుకు(ఆరు నెలలు) ఫైజల్ఖాన్ను పట్టుకుని తల్లి ఫరీదా బేగం కూర్చుంది. అదే సమయంలో ఫరీదా బేగం దగ్గరకు వచ్చిన ఓ మహిళ.. ఆమెతో సన్నిహితంగా మెలిగింది. ఇంతలో భోజనం తెచ్చుకునేందుకు ఫరీదా బేగం చిన్న కొడుకును అక్కడే వదిలేసి వార్డు నుంచి బయటకు వెళ్లింది. తిరిగొచ్చే సరికే బాలుడు కనిపించలేదు. ఆమె చుట్టుపక్కల వారిని అడిగినా.. పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దాంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కిడ్నాప్ చేసిన మహిళ నిజామాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్ పోలీసులకు సమాచారమివ్వగా మహిళను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బాలుడు క్షేమంగా ఉన్నాడు. పిల్లలు లేకపోవడంతో పెంచుకున్నందుకే బాలున్ని అపహరించినట్టు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. పోలీసులు బాలున్ని వారి నుంచి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.