నవతెలంగాణ – హైదరాబాద్: సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. అంటే 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్లోకి 19 ఏళ్ల భారత యువ ఆటగాడు అడుగుపెట్టాడు. ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ యువకెరటం ప్రపంచక్రికెట్ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువ కిషోరం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో పోటీ పడతాడని. తన అరంగేట్ర మ్యాచ్లోనే విమర్శలపాలైన ఆ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ క్రికెట్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే ఆదర్శం. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మిషన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి. కింగ్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గడిచాయి. శ్రీలంకపై డెబ్యూ.. 2008, ఆగస్ట్ 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లి టీమిండియా స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. తన తొలి మ్యాచ్లో కోహ్లి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడు ఓపెనర్గా పనికిరాడని కామెంట్లు చేశారు. కానీవిరాట్ కెరీర్లో 2010 నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఏడాది మూడు వన్డే సెంచరీలు బాదిన కోహ్లీ.. రాటుదేలుతూ వచ్చాడు. భారత్ గెలిచిన 2011 వరల్డ్ కప్ ఫైనల్లోనూ కీలక పరుగులు సాధించాడు. భారత్ విజయం సాధించడంలో అతడూ పాత్ర పోషించాడు. సచిన్ తెందూల్కర్కు చివరి వరల్డ్ కప్ను అంకితమిచ్చిన భారత జట్టు ఆటగాళ్లు అతడిని తమ భుజాలపై స్టేడియమంతా కలియతిప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటనపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘‘దాదాపు 21 ఏళ్ల నుంచి జాతీయ జట్టు బరువును సచిన్ మోశాడు. ఇక నుంచి మేం మోయాల్సిన సమయం వచ్చింది’’ అని వ్యాఖ్యానించాడు. అతడు చెప్పిన మాటలు అక్షర సత్యం. కానీ సచిన్ రికార్డులను, ఘనతలతోపాటు ఆ స్థాయి ఆటతీరుకు ఎవరూ చేరుకోలేరేమోనని అంతా భావించిన వేళ.. నేను ఉన్నానంటూ విరాట్ కోహ్లీ ముందుకొచ్చాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఆ దిశగా సాగాడు. సచిన్ తెందూల్కర్ మాదిరిగా 24ఏళ్ల క్రికెట్ కెరీర్ ఉంటే మాత్రం విరాట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు ఆస్కారం ఉంది. అయితే, ప్రస్తుతం 34 ఏళ్ల విరాట్ కోహ్లీ మహా అయితే మరో మూడు లేదా నాలుగేళ్లు మాత్రమే కెరీర్ను కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ కొన్ని రికార్డుల్లో సచిన్ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 46తో కొనసాగుతున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్లో తన ఫామ్ను కొనసాగిస్తే సచిన్ను అధిగమించడం విరాట్కు కష్టం కాదు.
సంపాదన..
విరాట్ కోహ్లీ విజయవంతమైన క్రికెటర్గా మారడంలో అతడి తండ్రి కీలక పాత్ర పోషించాడు. అయితే, 16 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ.. వ్యక్తిత్వపరంగా ఎంతో పరిణతి చెందాడు. అందుకే, విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన ఐదేళ్లకే (2013లో) ‘విరాట్ కోహ్లీ ఫౌండేషన్’ ప్రారంభించి సేవలు అందిస్తుండటం విశేషం. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న విరాట్ 2017లో జంటగా మారారు. వీరిద్దరికి 2021 జనవరి 11న ‘వామికా’ జన్మించింది. ఇటీవలే విరాట్ కోహ్లీకి సంబంధించి అతడి ఆస్తి విలువ రూ. 1000 కోట్లకుపైగా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అలాగే తన ఇన్స్టాగ్రామ్ ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లను వసూలు చేస్తాడనే వార్తలను ఇటీవల కోహ్లీ కొట్టిపడేసిన సంగతి తెలిసిందే.
15 ఏళ్లలో కోహ్లి సాధించిన ఘనతలు..
– అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిది రెండో స్థానం. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 100 సెంచరీలతో తొలి స్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు తన కెరీర్లో 76 సెంచరీలు సాధించాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో ఒక సెంచరీ విరాట్ చేశాడు.
– టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లినే. ఇప్పటివరకు 115 టీ20లు ఆడిన విరాట్.. 52.73 సగటుతో 4008 పరుగులు చేశాడు.
– వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీల రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. అతడు శ్రీలంకపై వన్డేలలో ఏకంగా 10 సెంచరీలు చేశాడు.
– అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. కోహ్లి తన కెరీర్లో ఇప్పటి వరకు 20 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సొతం చేసుకున్నాడు.