నవతెలంగాణ – నల్లగొండ: జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. తాజాగా నగరంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని విన్నవించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల ఇళ్లపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.