– కేంద్ర ప్రభుత్వంలో కొరవడిన ఆసక్తి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మన దేశంలో యువత అత్యధిక సంఖ్యలో ఉన్నారు. సామాజిక విభజనను అడ్డుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. తీవ్రవాద ప్రాబల్యాన్ని నిరోధించేందుకు సమర్ధవంతమైన విధానాలు రూపొందించి, వాటిని అమలు చేయడంలో యువతకు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జావేద్ అబిది ఫౌండేషన్ (జేఎఎఫ్) కన్వీనర్ షమీర్ రిషాద్ జాతీయ యువజన ముసాయిదా విధానం (ఎన్వైపీ)పై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. శాంతి, భద్రతలకు సంబంధించి తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో యువతకు భాగస్వామ్యం కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ముసాయిదా విధానంపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, కాబట్టి సమాచారం ఇవ్వలేమని మంత్రిత్వ శాఖ జవాబిచ్చింది.