నవతెలంగాణ – హైదరాబాద్
యూనివర్సిటీలో కొత్త కోర్సులతో ప్రయోగాలు చేయడంపై జేఎన్టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్రంలోనే యూనివర్సిటీ ముందంజలో ఉంది. గత నాలుగేండ్ల కిందటే జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏఐఎంల్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు అందిస్తున్నది. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే దాదాపు 150 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో కూడా ఇలాంటి సరికొత్త కోర్సులను ప్రవేశ పెట్టడానికి యూనివర్సిటీ అనుమతులు మంజూరు చేసింది. అందుకనుగుణంగా టీచింగ్ ఫ్యాకల్టీని సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అన్ని రకాల అఫిలియేషన్ కాలేజీలలో ఏఐఎంల్, డాటాసైన్స్ వంటి నూతన ఐటీ కోర్సుల ప్రాధాన్యతను పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా తెలిసే విధంగా ప్రచారం కల్పించింది.