పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం

– పోస్టరావిష్కరణలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను నెలకొల్పి పూజించాలని ప్రజలకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీఎస్‌పీసీబీ పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఏటా పంపిణీ చేస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, కలర్స్‌, కెమి కల్స్‌తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశశారు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యా నికి కారణమ య్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని పిలుపునిచ్చారు. సీనియర్‌ సోషల్‌ సైంటిస్ట్‌ ప్రసన్న కుమార్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌ రావు, అధికారులు పాల్గొన్నారు.