– అపోలో హాస్పిటల్స్ డాక్టర్ రాజేష్ రెడ్డి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జీవనశైలి, ఒత్తిడి మూలంగా యువతలో స్ట్రోక్ ప్రమాదం అధికంగా ఉందని అపోలో ఆస్పత్రి(జూబ్లీహిల్స్) న్యూ రాలజిస్ట్ డాక్టర్ సీ రాజేష్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్ట్రోక్ డే అక్టోబర్ 29 పురస్కరించుకొని ఒక ప్రకటన విడుదల చేశారు. మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకోవడం వల్ల స్ట్రోక్ వస్తోందన్నారు. దీనినే న్యూరోలాజికల్ లోటుగా చెప్పొచ్చన్నారు. ఇస్కీమిక్ స్ట్రోక్ అని పిలుస్తారన్నారు. రక్తనాళాలు చీలిపోవడం వల్ల మెదడులోకి రక్తం లీకేజ్ అవుతుందన్నారు. దీనిని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ సర్వసాధారణమని, ఈ స్ట్రోక్లు 80-85 శాతం ఉండగా, మిగిలినవన్నీ హెమరేజిక్ స్ట్రోక్లు అన్నారు. భారతదేశంలో ‘స్ట్రోక్’ అనేది వైకల్యానికి ప్రధాన కారణ మని, మరణాలకు రెండో సాధారణ కారణమని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతి 40 సెకన్లకు కనీసం ఒక స్ట్రోక్, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందన్నారు. స్ట్రోక్ ప్రారంభమైన తర్వాత ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల మెదడు కణాలు చనిపోతాయన్నారు. చికిత్స జరగని ప్రతి గంటలో మెదడు దాదాపు 3.6 సంవత్సరాల సాధారణ వద్ధాప్యంలో ఉన్నంత న్యూరాన్లను కోల్పోతుందని తెలిపారు. ఎవరికైనా స్ట్రోక్ను సూచించే లక్షణాలు ఉంటే, మెదడును రక్షించడానికి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని తెలిపారు. కొంతమంది రోగులు స్ట్రోక్ లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ టీఐఏ (ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్) ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పూర్తిగా మెరుగుపడవచ్చని తెలిపారు. టీఐఏ ఉన్న రోగులను మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలని, పెద్ద స్ట్రోక్ నివారణకు వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలని తెలిపారు. స్టోక్కి ముఖ్యంగా ఇస్కీమిక్ స్ట్రోక్కి సాధారణ కారణాలు హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు), డయాబెటిస్ మెల్లిటస్, అధిక రక్త కొలెస్ట్రాల్, సిగరెట్ తాగడం, గుండె జబ్బులు, అధికంగా మద్యం తీసుకోవడం, జీవనశైలి, అధిక ఒత్తిడి కారణమన్నారు. ప్రపంచ స్ట్రోక్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ ‘మేమంతా కలిసే ఉన్నాం, ఇది స్ట్రోక్ కంటే గొప్పది’ అని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో స్ట్రోక్ ను అధిగమించవచ్చన్నారు. ఫైబర్, ప్రొటీన్లు, పండ్లు, సలాడ్లు, సాధారణ కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. వారంలో ఎక్కువ రోజులు నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు కనీసం 30-40 నిమిషాలు.చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చన్నారు. హెచ్టీఎన్, డీఎం ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని తెలిపారు. మద్యపానాన్ని మానేయడం లేదా మితంగా తీసుకోవాలని తెలిపారు.