![చంద్రబాబుకు స్వల్ప ఊరట](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/cbn.jpg)
నవతెలంగాణ అమరావతి: టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra Babu)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హౌంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టు(ACB COURT)లో పీటీ వారెంట్ పెండింగ్లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.