తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని బోర్గాం పి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశల వారి ఆందోళనలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యమంత్రి గత సంవత్సరం మే నెలలో అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి గౌరవ వేతనం 3000 రూపాయలు పెండింగ్ ఏరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని, ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలని, కార్మికులందరికీ యూనిఫాం లు , పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కొత్తగా వంట పాత్రలను ఇవ్వాలని వంట షేడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్పందించకపోతే ఈనెల 28 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కో కన్వీనర్ ధ్యారంగుల కృష్ణ, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు శేఖర్, అశోక్, రాజేందర్ రెడ్డి, జులై కా బేగం, మౌనిక, లావణ్య తదితరులు పాల్గొన్నారు.